సిక్కింలో మోదీ ‘ఫుట్బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర!
- సిక్కిం రాష్ట్రం భారత యూనియన్లో చేరి 50 ఏళ్లు
- ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని
- తన చిన్ని స్నేహితులతో ఫుట్బాల్ ఆటను ఎంజాయ్ చేశానన్న ప్రధాని
సిక్కిం రాష్ట్రం భారత యూనియన్లో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గ్యాంగ్టక్ వెళ్లారు. తన పర్యటన సందర్భంగా, ఈ ఉదయం పాల్జోర్ స్టేడియంలో యువతీయువకులతో కలిసి ప్రధాని ఫుట్బాల్ ఆడారు. ఎంతో బిజీగా ఉండే ప్రధాని... కాసేపు యువతతో కలిసి ఆటను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. "నా చిన్ని స్నేహితులతో ఫుట్బాల్ ఆడటం చాలా సరదాగా, ఉత్తేజంగా అనిపించింది" అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించి రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిక్కిం యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, హెలెన్ లెప్చా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం వంటివి ఇందులో కీలకం. ఈ పర్యటనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల కోసం 6 క్రికెట్ అకాడమీలను కూడా ప్రధాని ప్రకటించారు.